Monday, February 28, 2011

శివాభిశేక ద్రవ్యాలు - ఫలాలు

Shivabhisheka Dravyas - Benifits
 


శివుడు అభిషేక ప్రియుడు - గంగోదకమే కాక వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించిన విశేష ఫలితాలు లభిస్తాయి. చాలా సులభంగా లభించే ఈ ద్రవ్యాలతో మన కోరికలను బట్టి వాటిని ఎంచుకుని అభిషేకించాలి. ఇవి అన్ని వివిధ ప్రాచీన గ్రంథాల్లో తెలిపినవి. నేను పాటించినవి కూడా - పదిమందికి చెప్పగా పూర్తి ఫలితాలు లభించినవి కూడా. 

పయసా సర్వ సౌఖ్యాని దద్నారోగ్య బలం యశః !
ఆజ్యేనైశ్వర్య వ్రుద్దిశ్చ దుఃఖ నాశాశ్చ శర్కరా !!

తాత్పర్యం: పాలతో అభిషేకం చేసిన సర్వ సౌఖ్యములు లభించును. పెరుగుతో ఆరోగ్య బలము, యశస్సు లభించును. నేయితో అభిషేకించిన ఐశ్వర్యము వృద్ది నొందును. చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము చేయును. 

తేజో వ్రుద్దిశ్చ మధునా ధనమిక్షు రనేనచ !
సర్వ సంపత్ సంరుద్దిశ్చ నారికేళ జలేనచ !!

తాత్పర్యం: తేనెతో అభిషేకించిన తేజో వృద్ది కల్గును. చెరుకు పాలచె అభిషేకించిన ధన వృద్ది కల్గును. కొబ్బరి నీళ్ళతో అభిషేకించిన సకల సంపదలు లభించును.  

మహాపాపాని నశ్యన్తి తక్షనాద్బస్మవారినా !
గంధతోయేన సత్పుత్ర లాభాశ్చ న సంశయః !!

తాత్పర్యం: విభూతి కలపిన నీటిచే అభిషేకించిన మహాపాపాలు అన్ని నశించగలవు. గంధము కలపిన నీటిచే అభిషేకించిన సత్పుత్ర లాభము కలుగును. 

భూ లాభః పుష్పతోయైన భాగ్యం బిల్వజలేనవై !
దూర్వ జలేన లభతే నాన్యదా నష్ట సంభవె !!

 తాత్పర్యం: పూల నీటితో అభిషేకించిన భూలాభము కలుగును. బిల్వజలముతో అభిషేకించిన భాగ్యము లభించును. గరిక నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. 

అపమృత్యు హరంచైవ తిల తైలాభిషేకనం !
రుద్రాక్ష సరినైవ మహతీం శ్రియమాప్నుయాత్ !!

 తాత్పర్యం: నువ్వుల నూనేచే అభిషేకించిన అపమృత్యువు నశించును. రుద్రాక్ష నీటితో అభిషేకము వలన సకల ఐశ్వర్యములు లభించును. 

స్వర్నోదకాభిషేకేన ఘోర దారిద్ర నాశనం !
అన్నెన రాజ్య సంప్రాప్తిర్మోక్ష మాయుష్య జీవనం !!
 తాత్పర్యం: బంగారపు నీటితో ఘోర దారిద్రము నశించును. అన్నముచే అభిషేకించిన రాజ్య సంప్రాప్తి యు, మోక్షమును, దీర్గాయుర్దాయము లభించును. 

ద్రాక్షారసేన సర్వత్ర విజయం లభతే ధృవం !
ఖర్జూర ఫలసారేన శత్రుహానిర్భవిష్యతి !!

తాత్పర్యం:
ద్రాక్ష రసముచే అన్నింటా విజయము లభించును. ఖర్జూర ఫల రసముతో అభిషేకించిన శత్రుహాని అనేది ఉండకుండా పోతుంది. 


వైరాగ్యం లభతే జంబూ ఫల సారేనవై జగుహు !
కస్తూరీ సలిలేనైవ చక్రవర్తిత్వ మశుతే !!

తాత్పర్యం:
నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. కస్తూరి నీతితో అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును.

నవరత్నాంబునా దాన్యగ్రుహ గోవ్రుద్ది రుచ్యుతే !
రసాల ఫల సారేన దీర్ఘ వ్యాధి వినాశనం !!

 తాత్పర్యం: నవరత్న ఉదకముచే అభిషేకించిన ధాన్యము, గృహము, గోవ్రుద్ది కలుగును. మామిడిపండ్ల రసముచే అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 

హరిద్ర వారినాలింగా స్నానం వై మంగలప్రడం !
రుద్రా స్నాన ఫలన్యే తన్యుచ్యంతే మునిభిహపురా !!

 తాత్పర్యం: పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము (పెళ్ళికాని వారికి పెళ్ళిళ్ళు కాగలవు) - సౌభాగ్యము సిద్దించును. రుద్రా స్నాన ఫలములు మునులచే వచియించబడినట్టివి.



Monday, February 21, 2011

Dwadash Jyotirling

శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం


సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం
భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే

గుజరాత్ రాష్ట్ర ప్రభాస క్షేత్రంలో సోమనాథ దేవాలయం కలదు. అతి పురాతనమైనది ఈ దేవాలయం. భారత దేశంలో ఈ దేవాలయం దోపిడీకి గురైనంతగా మరే దేవాలయం గురి కాలేదు. క్రీ.శ.722 లో సింధూ ప్రాంత అధిపతి అయిన జునాయిద్ తన సైన్యాన్ని పంపి ఆలయాన్ని ద్వంసం చేయించాడు. భారత దేశపు రాజులు, భక్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. కాగా క్రీ.శ.1026 లో ఘజనీ మొహమ్మద్ తన సైన్యంతో దండ యాత్ర చేసి ఆలయాన్ని ద్వంసం చేసి ఆలయంలో కల అపార సంపదనంతా దోచుకెళ్ళాడు. ముస్లీం పాలనలో ఆలయం పలు మార్లు దాడులకు గురయింది. క్రీ.శ.1297, 1394, 1607 ల్లో ద్వంసం చేసి దోపిడీ చేశారు. స్వాతంత్ర్యం లభించాక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆలయ పునర్నిర్మాణం చేయబడింది. ఎన్ని కాలాలు గడిచినా చెరగని, తరగని భక్తి ప్రపత్తులతో అశేష జనం అనుదినం సొమనాథున్ని దర్శించి తరిస్తున్నారు.
పురాణ గాథ:
దక్షప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (27 నక్షత్రాల పేర్లు వారివే) చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాని చంద్రుడు మాత్రం అందరికంటే అందమైన రోహిణి పైననే ప్రేమ చూపి తక్కినవారిని నిర్లక్ష్యం చేస్తాడు. మిగతా 26 మంది తండ్రి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి తమకు జరుగుతున్నా అన్యాయాన్ని విన్నవించుకుంటారు. చంద్రున్ని పిలిచి అందర్నీ సమానంగా ఆదరించమని చెపుతాడు. అయినా చంద్రుడు రోహిణి పైననే తన ప్రేమంతా కురిపిస్తుంటాడు, దాంతో ఆగ్రహం చెందిన దక్షుడు చంద్రున్ని క్షయ వ్యాధి గ్రస్తుడివికా అని శపిస్తాడు. శాప నివారణకు దేవతలా నెవరి నాశ్రయించినా దక్షుని శాపం నుండి కాపాడగలవాడు శివుడొక్కడే అని, శివునికి తపస్సు చేసి మెప్పించమని సలహా ఇస్తారు. చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి ఘోర తపస్సు నాచారిస్తాడు, ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, దక్షుని శాపానికి తిరుగుండదని అయినా నీ భక్తికి మెచ్చి నెలలో 15 రోజులు క్షయం, 15 రోజులు వృద్ది అయ్యేలా చేస్తానని చంద్రుని శాపాన్ని మారుస్తాడు. చంద్రునికి  శాప  విమోచనం  చేసిన  పరమేశ్వరుడు  ఇక్కడ  సొమనాథునిగా వెలిశాడు. చంద్రుడు  కృతజ్ఞతగా  సొమనాథునికి  బంగారు ఆలయాన్ని నిర్మిస్తాడు.

విశేషం:
ఎక్కడా లేని విధంగా ఇక్కడ గర్భాలయం, సభా మండపం, నృత్య మండపం గోపురములు 150 అడుగుల ఎత్తుతో విరాజిల్లుచున్నది. గర్భాలయపు శిఖర కలశం 10 టన్నుల బరువు కలిగి ఉంది, శిఖరద్వజమ్ 27 అడుగులతో చూపరులను ఆకట్టుకొనును. శ్రీ కృష్ణుని నిర్యాణం  కూడా  ఇక్కడికి  సమీపంలోనే జరిగిందని చెపుతారు. అరేబియా సముద్రం ప్రక్కన ఉండే ఈ క్షేత్రం కడు రామనీయస్థలం.


శ్రీ మల్లిఖార్జున జ్యోతిర్లింగం



శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శేషాద్రి శృంగేపి సదావసంతం
తమర్జునం మల్లికపూర్వ మేనం, నమామి సంసార సముద్రసేతుం


ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అడవుల్లో జ్యోతిర్లింగంగా వెలసిన శివుడు  మల్లిఖార్జునునిగా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రం అతి పురాతనం, అతి  ప్రాచీణం, యుగయుగాల నుండి యావద్ భారతావని చే పూజించ బడుచున్న దైవం - శ్రీశైల మల్లన్న. క్రి.పూ. నుండి ఈ గుడికి సంబందించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ క్షేత్రం శాతవాహనుల, పల్లవుల, విష్ణు కుండినుల, కాకతీయుల, రెడ్డి రాజుల, విజయనగర రాజుల పరిపాలనలో కొనసాగింది.  ఎందరెందరో రాజులు గుడికి కానుకలు సమర్పించారు. బ్రహ్మానంద రాయలు, శ్రీ కృష్ణ దేవరాయలు గోపురాలను సాలు మండపాలను కట్టించారు, ఎక్కడినుండో మహారాష్ట్ర నుండి వచ్చి శివాజీ ఒక గోపురాన్ని కట్టించి మహమ్మదీయుల దాడుల నుండి గుడిని కాపాడుటకు కొంత సైన్యాన్ని ఉంచటం జరిగింది. కాకతీయుల, రెడ్డి రాజుల కాలంలో ఈ దేవాలయం మహా వైభోగంగా వెలిగింది. గుడే కాదు గుడి వాకిలి కూడా బంగారంతో ఉండేది అంటే మల్లిఖార్జునుని వైభవాన్ని ఊహించుకోవచ్చు. కీకారణ్యంలో ఉండడంవల్ల, భక్తుల రాకపోకలకు సౌకర్యం లేకపోవటం వల్ల, మహమ్మదీయుల దండ యాత్రల వల్ల, పరిపాలనల వల్ల తన ప్రాభవాన్ని కోల్పోయింది. 


పురాణ గాథ:
శ్రీశైల క్షేత్ర ప్రస్తావన అన్ని పురాణాల్లో కలదు. అతి ప్రచీనంగా చెప్పబడే స్కాందపురాణంలో ప్రత్యేకించి శ్రీశైలం గురించి "శ్రీశైలఖండం" అను పేర ఒక ఖండమే కలదు. పురానాల్లోనే కాక అతి ప్రాచీన గ్రంధాలలోనూ శ్రేశైల ప్రస్తావన కలదు.
మల్లిఖార్జునుడు ఇక్కడ స్వాయంబువుగా (Natural-ఎవరిచేతనూ ప్రతిష్టింప బడనిది) అవతరించాడు. క్షేత్రం ఏర్పడుటకు గూర్చి ఎన్నో కథలు ఆయా కాలాల్లో ప్రచారంలోకి వచ్చాయి. అందులో ప్రధానంగా శిలాదుడనే మహర్షి ఇక్కడ శివునికై తపస్సు చేసి 3 కొడుకులను పొందుతాడు. అందులో శ్రీ పర్వతుడు శివునికై ఘోర తపస్సు చేసి, శివున్ని ప్రసన్నుని చేసుకుని తనపైన వెలయ వలసిందిగా వరం కోరుకుంటాడు. అలా శ్రీ పర్వతుడు శ్రీశైల పర్వతమవగా మల్లిఖార్జునుడిగా పరమేశ్వరుడు స్వాయంబువై వెలియటం జరిగింది. మరో పురాణ కథనం ప్రకారం కుమారస్వామి శివ పర్వతులపై అలిగి ఈ పర్వతంపైకి రాగా, శివ పార్వతులు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ భ్రమరాంబ మల్లిఖార్జునులుగా  వెలియటం జరిగింది.

విశేషం:
ఏ దేవాలయంలోనూ లేని విధంగా ఇక్కడ లింగాన్ని కాళ్ళు, చేతులు కడుగుకోకుండా వచ్చి రాగానే క్షణ మాత్రం దర్శనం చేయక ఉండలేక, అలాగే వెళ్లి దర్శనం చేసుకోవటం (అదీ చేతులు పెట్టి, నొసటితో తాకి) ప్రత్యేకత, దీన్ని దూలిదర్శనం అంటారు. ప్రస్తుతం కొంచెం మార్పు ఉన్నా స్నానాదులు ఆచరించినవాడై, సాంప్రదాయ దుస్తుల్లో అభిషేకం టికెట్ తో వెళ్లి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు (సుప్రభాత సమయంలో మాత్రం ఏ దుస్తులతో ఉన్నా సంపూర్ణ స్పర్శ దర్శనం లభిస్తుంది). చుట్టూతా వందల కిలోమీటర్ల  దట్టమైన అడవులతో కూడి ఉన్న శ్రీశైలం ఎంతో రమణీయంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణానికి ఎంతో అనుకూలం. ఇక్కడి దర్శనీయ స్థలాలు కోకొల్లలు. పాతాళగంగ, అక్కమహాదేవి బిళాలు, భీముని కొలను లాంటివి మరెక్కడా దర్శించాలేనట్టి అధ్బుత ప్రదేశాలు.



శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం



అవన్తికాయాం విహితావతారం, ముక్తిప్రదానాయచ సజ్జనానాం
అకాల మ్రుత్యోహ పరిరక్షనార్థం, వందే మహాకాల మహం సురేశం


మధ్యప్రదేశ్, ఉజ్జయినీ లో వెలసిన స్వయంభు జ్యోతిర్లింగం మహాకాళేశ్వర లింగం. ఈ క్షేత్రం గురించి పురాణాల్లోనూ, ప్రాచీన గ్రంధాలలోనూ వర్ణితమై ఉంది. ఉజ్జయిని అతి ప్రాచీన నగరం. అతి పురాతనమైన ఈ దేవాలయాన్ని మహమ్మదీయ సుల్తానుల దండయాత్రల్లో ద్వంసం కావించబడింది. మరాఠా రాజుల కాలంలో క్రీ.శ.1736 లో రానోజీరావు షిండే మహారాజు ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించటం జరిగింది.

 పురాణ గాథ:
ప్రజలను వేధిస్తున్న దూశాణసురుడనే  రాక్షసుని సంహరించిన రుద్రుడు ఇక్కడ మహా కాళేశ్వరునిగా వెలిసాడని  చెబుతారు.

విశేషం:
మహాకాళేశ్వర లింగం దక్షిణ ముఖంగా ఉండటం ఇక్కడి విశేషం, అంతేకాక శివ నిర్మాల్యాన్నివిసర్జించక (వాడిన బిల్వ దళాలను) మళ్ళీ వాడటం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏ దేవాలయంలోనూ ఇవ్వని విదంగా ప్రత్యేకంగా ఇచ్చే భస్మ హారతి చూడటానికి కళ్ళు చాలవు.



శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం


కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ
సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే


మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో ఇండోర్-ఖండ్వా మద్యన ఉంది ఈ క్షేత్రం. ఇండోర్ కు 77 కి.మీ., ఉజ్జయినికి 133 కి.మీ. దూరంలో కలదు. ఇది ఒక island, ఈ ద్వీపం ఓంకార రూపంలో ఉండటం మరో వేశేషం. ఇక్కడ ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్ పేరుతో రెండు లింగాలు కలవు. రెండింటినీ దర్శించటం ముఖ్యం. రెండు కూడా జ్యోతిర్లింగాలు గానే పూజించ బడతాయి. ఇక్కడ వెలసిన జ్యోతిర్లింగం రెండుగా చీలి ఓంకారేశ్వర్, మమలేశ్వర్ (అమలేశ్వర్) గా మారిందని ప్రతీతి. ఇక్కడి దేవాలయం చిన్నదిగా ఉన్నా అందంగా ఉంటుంది, నవీనంగా కనిపిస్తుంది. ఈ ఆలయం కూడా జీర్ణమైన ఆలయాన్ని పునరుద్దరించినట్టు కనిపిస్తుంది.

పురాణ గాథ: 
పూర్వం వింధ్య పర్వతం మీదుగా మేరు పర్వతం సందర్శించిన నారదుడు తిరుగు ప్రయాణంలో విద్య పర్వతంతో మేరు పర్వతం ఎత్తును, వైభవాన్ని పేరు ప్రఖ్యాతిని పోగాడుతాడు. అసూయ చెందిన వింధ్య పర్వతం తానూ అంతకు ఎత్తు పెరగాలని శివునికై తపస్సు చేస్తుంది. ప్రత్యక్షమైన శివుడు నీవు పేరు ప్రఖ్యాతులు పొందగలవని, అందరూ నిత్యం సందర్శించి కీర్తించుతారని వరమిస్తాడు. వారి కోరికపై శివుడు అక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. శివుని అనుగ్రహం పొందిన వింధ్యుడు పెరుగుతూనే ఉంటాడు, అది అనంతమై సృష్టికి అపకారాన్నివ్వగలదని భావించిన అగస్త్య ముని తన భార్యతో సహా వచ్చి తాను శ్రీశైలం వెళుతున్నానని నీవు పెరిగితే నేను తిరిగి ఇటు రాలేనని, కావున తాను తిరిగి వచ్చేంత వరకు పెరగ వద్దని వింధ్యుని వద్ద మాట తీసుకుని వెళతాడు, తిరిగి వస్తే మళ్ళీ పెరగటం ప్రారంభిస్తాడని శ్రీశైలంలోనే భార్యా సమేతంగా ఉండిపోతాడు అగస్త్యుడు.

మరో పురాణ కథనం ప్రకారం పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత అనే రాజు, అతని కుమారులు అంబరీషుడు, ముచికుందులు శివునికై ఘోర తపస్సు చేసి ఇక్కడ శివుని జ్యోతిర్లింగంగా వెలయవలసిందిగా కోరతారు. వారి కోరికన శివుడు ఇక్కడ ఓంకారేశ్వర, మమలేశ్వర స్వయంభు లింగ రూపంలో వెలుస్తాడు.

విశేషం:
ఇక్కడి సభామండపం పెద్ద అందమైన స్తంభాలతో రమణీయంగా ఉంటుంది.నర్మదా నది రెండు పాయలుగా చీలిన ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కోతులకై Monkey Fooding Centre కలదు, ఇక్కడ కోతులకు సందర్శకులు ఆహారం పెట్టటం విశేషం. నర్మదా  నదిపైని  Dam  ప్రపంచంలో కెల్లా అతి పెద్ద Dam కావడం వేశేషం.



శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం


పూర్వోత్తరే పారలికాభిదానే, సదాశివం తం గిరిజాసమేతం
సురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం సతతం నమామి



శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం


యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి


భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణే కు 127 కి.మీ., ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది.  ఈ క్షేత్ర ప్రస్తావన పలు పురాణాల్లో కలదు. చరిత్ర ఆధారంగా కూడా ఈ క్షేత్రం ప్రాచీనం. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు. తరువాత పీష్వాల దీవాన్ అయిన నాడాపడన్వీస అనే అతను ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ.1437 లో చిమన్జీ అంతజీ నాయక్ అను నతను సభా మండపాన్ని నిర్మించాడు. శివాజీ అదిగా  గల  మహారాజు లెందరో దర్శించి క్షేత్రాభివ్రుద్ది గావించారు. ఇది నవీన-పురాతన ఆకృతుల్లో నిర్మితమై ఉన్నది. లోయభాగంలో పాతాళంలో ఉండే భీమేశ్వరుని మెట్ల ద్వారా వెళ్లి దర్శించుకోవాలి.

పురాణ గాథ:
పూర్వం కుంభకర్ణుడు అతని భార్య కర్కటిల కు భీమాసురుడనే వాడు పుడతాడు. ముల్లోకాల్లో  తనంత  వాడు  లేకుండా బ్రహ్మ వరం పొంది తనంత వాడు లేడని గర్వించి శివ భక్తులను హిమిసించటం చేస్తాడు. పాతాళ  చక్రవర్తి అయిన కామరూపేశ్వరున్ని బందిస్తాడు. అయినా అతను శివుని పూజించటం సహించని భీమాసురుడు ఆటను పూజిస్తున్న లింగంపైన కత్తి దూస్తాడు. శివుడు ఫాల నేత్రంతో అతన్ని మసి చేస్తాడు. ఇక్కడ వెలసిన శివుడు భీమాసురుని మసి చేసిన వాడై భీమ శంకరునిగా జ్యోతిర్లింగా రూపంలో వెలిశాడు. ఇక్కడ శివుడు డాకిన్యాది శక్తులతో వెలసినాడంటారు. పరమ శివుడు త్రిపురాసుర సంహారం చేసింది ఇక్కడే అని మరో పురాణ ప్రతీతి.

విశేషం:
3250 feet  ఎత్తులో ఉన్న కొండను కాలి నడకన చేరుకోవడం అత్యంత ప్రమాదకరం. పర్వతారోహకులు మాత్రమే చేరుకోగలరు. భీమాశంకర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం చూడదగ్గ ప్రదేశం. అక్కడ వసతి సౌకర్యాలు తక్కువ అని గుర్తుంచుకోవాలి. కట్టెతో చేసిన అత్యంత సుందరమైన స్వాగత ద్వారం ఎంతో రమణీయం. భీమాశంకర్ కి దెగ్గర ప్రదేశం కజ్రత్. కజ్రత్ కు రైలు లో వెళ్లి అక్కడినుండి బస్సులో 40km ప్రయాణం చేసి భీమాశంకర్ జ్యోతిర్లింగం వెలసిన ఖండాస్ చేరుకోగలరు.

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం


శ్రీ తామ్రామపర్నీ జలరాశియోగే, నిబధ్యసేతుం నిషి బిల్వపత్రైహి
శ్రీ రామచంద్రేన సమర్చితం , తం రామేశ్వరాఖ్యం సతతం నామామి

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం


అమర్తసంజ్నే నగరేచ రంయే, విభూశితంగం వివిధైశ్చ భోగైహి
సాధ్భుక్తి ముక్తిప్రదమీశ మేకం, శ్రీ నాగానాతం శరణం ప్రపద్యే

శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం


సానంద మానంధవనే వసంత , మానంధకంధం హతపాప బృందం
వారానసీనాథ మనాతనాతం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే


శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం



సింహాద్రి పార్శ్వేషి తటే ర మంతం , గోదావరీ తీర పవిత్ర దేశే
యద్దర్శనాత్పాతక జాతనాశః , ప్రజాయతే త్రయంబక మీశమీడే


శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం


మహాద్రిపార్శ్వేచ తటే రామంతం, అమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైహి
సురాసురైర్యక్ష మహోరగాద్యైహి కేదారమీశం శివమేకమీడే


శ్రీ ఘ్రిశ్నేశ్వర జ్యోతిర్లింగం


ఇలాపురే రమ్య విశాల కేస్మిన్, సముల్లాసం తంచ జగద్పరేణ్యం
వందే మహోదార తర స్వభావం, గ్రిశ్నేశ్వరాఖ్యం శరణం ప్రప్రద్యే.



ద్వాదశ జ్యోతిర్లింగాలు



జ్యోతిర్లింగ స్త్రోత్రం

సౌరాష్ట్రే సోమనతంచ, శ్రీ శైలే మల్లిఖార్జునం
ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకార మమలేశ్వరం
పరల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం
సేతు బందేతు రామేశం, నాగేశం దారుకావనే
వారనాశ్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే
హిమాల యేతు కేదారం, ఘ్రిష్మేశంచ శివాలయే